Banner
Watermark
ఆరోగ్యకరమైన తల్లి – ఆరోగ్యకరమైన కుటుంబం, బలమైన సమాజానికి పునాది తల్లి ఆరోగ్యం – ప్రజారోగ్య వ్యవస్థకు అద్దం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
📅 08 April 2026, 03:31 PM ✍️ admin
News Image
“ఆరోగ్యకరమైన తల్లి – ఆరోగ్యకరమైన కుటుంబం, బలమైన సమాజానికి పునాది” అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.

99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారోత్సవాల కింద మూడో రోజు జిల్లా స్థాయి సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమ వర్క్ షాప్ ను జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లి ఆరోగ్యం అనేది కేవలం ఆరోగ్య సూచిక మాత్రమే కాకుండా, ప్రజారోగ్య వ్యవస్థకు అద్దం పడుతుందని పేర్కొన్నారు. అందువల్ల ఇది కేవలం గణాంకాల పరిమితి కాదని, సమగ్ర అభివృద్ధికి సూచికగా భావించాలన్నారు.

గత రెండు దశాబ్దాల కాలంలో భారతదేశంలో మాతా-శిశు మరణాల తగ్గింపులో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, ఇంకా మెరుగైన చర్యలు అవసరమని తెలిపారు. జిల్లా స్థాయిలో మాతా-శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా హైరిస్క్ గర్భిణీలను త్వరగా గుర్తించడం, సమయానికి వారికి నాణ్యమైన సేవలు అందించడం ప్రధానమన్నారు. ప్రతి గర్భిణీ మహిళను ప్రారంభ దశలోనే నమోదు చేయడం, నియమిత గర్భధారణ పరీక్షలు (ANC), హీమోగ్లోబిన్ పరీక్షలు, రక్తపోటు పరీక్షలు, పోషకాహార సలహాలు, ఐరన్, ఫోలిక్ ఆమ్ల మాత్రలను సరఫరా చేయడం తప్పనిసరిగా ఉండాలని సూచించారు.

రక్తహీనత, రక్తపోటు, గర్భకాల మధుమేహం వంటి సమస్యలను సబ్ సెంటర్, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ స్థాయిలో సమర్థంగా గుర్తించాలన్నారు.

జనని సురక్ష యోజన, జనని శిశు సురక్ష కార్యక్రమం, లక్ష్య (Lakshya) వంటి పథకాలు తల్లి-శిశు ఆరోగ్య సేవలను విస్తరించాయని, ఇవి ప్రతి ఆరోగ్య కేంద్రంలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

గర్భధారణ నుంచి ప్రసవం వరకు, అలాగే ప్రసవానంతర కాలం వరకు నిరంతర సేవలు (Continuum of Care) అందించడం అత్యంత ముఖ్యమన్నారు. ప్రసవం తర్వాత తొలి 48 గంటలు అత్యంత కీలకమైనవి అయినందున ఆ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.

అదే విధంగా తల్లి ఆరోగ్య పర్యవేక్షణ, తల్లిపాలు పట్టడం, కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు.

తల్లీబిడ్డలు మెరుగైన వైద్య సేవలు పొందేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, పోషణ, ప్రసూతి సేవల ప్రాముఖ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.
మాతృ మరణాలను తగ్గించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి గర్భిణీకి సమయానుకూలంగా వైద్య పరీక్షలు, అవసరమైన పోషకాహారం, టీకాలు అందించాలన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వాటిని వినియోగించుకునేలా చూడాలన్నారు. ప్రతి గర్భిణీ సురక్షిత ప్రసవం పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో సాధారణ ప్రసవాల శాతాన్ని మరింతగా పెంచాలన్నారు. అలాగే ప్రజలకు సాధారణ ప్రసవాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీలలో సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. జిల్లాలో ప్రసూతి మరణాలు, పిల్లల మరణాలు ఎక్కడా కూడా జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రుల్లో లేబర్ రూంలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

జిల్లాలో తల్లి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెంచి, సురక్షిత మాతృత్వం సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.

అంతకుముందు మాతా-శిశు సంరక్షణపై, పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ అమలు, సాధారణ ప్రసవాల పెంపు, పోషకాహారం, తదితరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైద్యాధికారులు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, డీసీహెచ్ఎస్ నరేందర్ శర్మ, జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం, డీడబ్ల్యూఓ కోదండరాములు, ప్రోగ్రామింగ్ అధికారి డా. శ్రీ హర్ష, గైనకాలజిస్ట్ లు డా. సునీత, డా. అపర్ణ, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, వైద్యాధికారాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home