రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుదాం మెగా రక్తదాన శిబిరం ప్రారంభం - నిర్వహణ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుదామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు.
99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల – జీజీహెచ్ ఆధ్వర్యంలో, మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్ సహకారంతో మంగళవారం జిల్లా కేంద్రంలోని చంపక్ హిల్స్ పరిధిలో గల ప్రభుత్వ వైద్య కళాశాలలోని కాన్ఫరెన్స్ హాల్లో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై, ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రక్తదానం అత్యంత మహత్తరమైన సేవ అని పేర్కొన్నారు. సమాజంలో అవసరమైన వారికి సమయానికి రక్తం అందించడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.
రక్తదానం చేయడం చాలా గొప్ప కార్యక్రమమని, యువత ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ రక్తదాన శిబిరంలో వైద్య విద్యార్థులు, సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి, మానవతా సేవకు తమ వంతు సహకారం అందించారు.
వైద్యులు ఈ రక్త సేకరణ ప్రక్రియను పర్యవేక్షిస్తూ, దాతలకు అవసరమైన సూచనలు చేశారు.
అదే విధంగా వైద్య కళాశాలలోని ల్యాబ్ ను సందర్శించి, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం, జీఎంసీ ప్రిన్సిపల్ డా. నాగమణి, ఆర్ఎంఓ డా. కోటాచలం, వైద్యులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.