ఘనంగా జిల్లా స్థాయి రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీలు:: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష *రీడింగ్ కాంపిటీషన్ 2026 లో విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, ఏప్రిల్ 02:
------------------------------
జిల్లాస్థాయి రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా జరిగాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రీడింగ్ కాంపిటీషన్ 2026 లో మంచి ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎఫ్.ఎల్.ఎన్ లో భాగంగా గురువారం జిల్లా పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. 14 మండలాల నుంచి 22 మంది విద్యార్థులు ఈ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని, విద్యార్థులకు తెలుగు ఆంగ్లం ఉర్దూ భాషల్లో ధారాళంగా చదవడం కథలు చెప్పడం వంటి అంశాలలో పోటీలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు.
రీడింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రీడింగ్ కాంపిటీషన్ నిర్వహించి పిల్లలకు బహుమతులు అందించాలని వినూత్నంగా ఆలోచించిన ఉపాధ్యాయులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉండాలని అప్పుడే వారు మంచి విజయాలు సాధిస్తారని కలెక్టర్ సూచించారు.
సబ్జెక్టుల వారిగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి బహుమతులు జ్ఞాపికలు ప్రశంస పత్రాలను అందిస్తున్నామని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి జి.శారద, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి డాక్టర్ పిఎం షేక్ జిల్లా రిసోర్స్ టీం అధికారి గడ్డం జగదీశ్వర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
---------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది