మార్చి 17 జనగామ గ్యాస్ సిలిండర్ ల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి నిరంతర పర్యవేక్షణ ముఖ్యం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
మంగళవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, ఇతర సంబంధిత అధికారులతో కలిసి గ్యాస్ సరఫరా, నిల్వలపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లాస్థాయి గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కమిటీ (డీఎల్ఈఎస్ఎంసీ) సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ అమలు, ప్రస్తుత గ్యాస్ సరఫరా, నిల్వల పరిస్థితిపై క్షుణ్ణంగా ఆయా శాఖల సంబంధిత అధికారుల ద్వారా ఆరా తీశారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం (12) గ్యాస్ ఏజెన్సీల పరిధిలో డిమాండ్ కు అనుగుణంగా సంబంధిత ఏజెన్సీల వద్ద వినియోగదారులకు సరిపడా గ్యాస్ సిలిండర్లు నిల్వలో ఉన్నాయని, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
పౌరసరఫరాల విజిలెన్స్ కమిటీ సభ్యులు నిత్యం గ్యాస్ డీలర్ల వద్ద ఉన్న నిల్వలను గమనిస్తూ ఉండాలని, వినియోగదారులతో పాటు వయోవృద్ధులు, దివ్యాంగులు, ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అలాగే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
హోటళ్ళు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్ మాత్రమే ఉపయోగించాలని, డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కమిటీ సభ్యులు గ్యాస్ సరఫరా ఇబ్బందులపై పరిశీలన చేయాలన్నారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ గా వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
అదే విధంగా జిల్లాలో గ్యాస్ సిలిండర్ లను రవాణా చేస్తున్న వాహనాలకు జీపీఎస్ ట్రాకర్ ను పక్కాగా అమర్చి, ఆ వాహన స్థానం ఎక్కడ ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రెండు కంటే ఎక్కువ సిలిండర్లు ఉంటే, ఆ సిలిండర్లను సీజ్ చేయాలని సూచించారు. చెక్ పోస్టులు వద్ద పటిష్ట భద్రత నడుమ వాహనాలను తనిఖీ చేయాలని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో కనీసం 5 రోజులకు సరిపడా నిల్వలు ఉండే విధంగా సరిచూసుకోవాలని ఎల్పీజీ సభ్యులకు సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు రవీందర్, హసీనా బేగం, విక్రమ్, డీడబ్ల్యూఓ కోదండరాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, ఇతర సంబంధిత అధికారులు, గ్యాస్ డీలర్ల సంఘం ప్రెసిడెంట్, సభ్యులు, డిస్ట్రిబ్యూటర్ లు, తదితరులు పాల్గొన్నారు.