Banner
Watermark
సమ్మక్క సారలమ్మ జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
📅 23 January 2026, 05:20 PM ✍️ admin
News Image
జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహణ
సమ్మక్క- సారలమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలన గోదావరిఖని,రామగుండం మండలం
సమ్మక్క సారలమ్మ జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
మిని మేడారంగా సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ
గోదావరిఖని జాతర స్థలాన్ని ఎమ్మెల్యే తో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్
గోదావరిఖని, జనవరి- 23:
సమ్మక్క సారలమ్మ జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ తో కలిసి గోదావరిఖని సమక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించే సమక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లను చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు రానున్నారని, 8 నుంచి 10 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సింగరేణి సంస్థ దాదాపు 7 నుంచి 8 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ గోదావరిఖని సమ్మక్క సారలమ్మ జాతరకు అవసరమైన ఏర్పాట్లు చేసిందని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మరో 2 కోట్ల రూపాయలను జాతర కోసం ఖర్చు చేశామని అన్నారు. భక్తుల వాహనాలకు సంబంధించిన పార్కింగ్ నుంచి మళ్లీ తిరిగి వెళ్లే వరకు అవసరమైన ఏర్పాట్లు ప్రణాళిక బద్ధంగా చేశామని అన్నారు.జాతర నిర్వహణకు సంబంధించి సింగరేణి, ఎన్టిపిసి , మున్సిపాలిటీ అధికారులు సమన్వయంతో పని చేస్తూ జాతరను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జాతర సందర్భంగా పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత కల్పించే అదనపు కార్మికులను ఏర్పాటు చేశామని అన్నారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసే వారికి అవసరమైన షవర్స్, మహిళలు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జాతర జరుగు నాలుగు రోజులు వైద్య సిబ్బంది అవసరమైన మందులు తోపాటు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తారని, గజ ఈత గాళ్లను అందుబాటులో పెట్టుకున్నామని అన్నారు.రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి ఇంటి నుంచి పెద్ద ఎత్తున సమ్మక్క సారలమ్మ జాతర జరుపుకుంటామని అన్నారు. ప్రజలకు మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా సమ్మక్క సారలమ్మ జాతర అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రస్తుతం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశామని అన్నారు.జాతర నిర్వహణకు సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నామని , సీసీ కెమెరాలతో కూడిన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. గోలివాడ ప్రాంతంలో కూడా 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి జాతరకు ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. 5 నుంచి 6 లక్షల మంది పైగా భక్తులు గోదావరిఖని సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకుంటారని , 2వ మేడారం గోదావరిఖని పేరుగాంచిందని ఎమ్మెల్యే తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి గోదావరి నదిలో పుణ్యస్నానం చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పాలకుర్తి మండలం ఫర్టిలైజర్ సిటీ లోని జడ్పీ స్కూల్ ను కలెక్టర్ పరిశీలించి అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అంతకు ముందు పాలకుర్తి మండలం ఈసల తక్కలపల్లి లోని సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఆర్జి 1 జిఎం లలిత్, దేవదాయ శాఖ కమిషనర్ , గోదావరిఖని జాతర కమిటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి విమల సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.
🏠 Home