Banner
Watermark
రాజన్న కోడెలను సంరక్షించాలి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
📅 21 January 2026, 04:28 PM ✍️ admin
News Image
పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
అర్హతలు ఉన్న వారికే 103 జతల జీవాల పంపిణీ
వేములవాడ, జనవరి - 21
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలల నుంచి కోడెలను తీసుకువెళ్ళే రైతులు వాటిని సంరక్షించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో అర్హులైన రైతులకు బుధవారం 103 జతల కోడెలను ఉచితంగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై రైతులకు అందజేశారు. వ్యవసాయ భూమి ఉందా? ఇప్పటికే పశువులు ఉన్నాయా అని పలువురు రైతులను ఇంచార్జి కలెక్టర్ ఆరా తీశారు.ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. కోడెల కోసం ప్రకటన జారీ చేశామని, ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించామని తెలిపారు. గత, ప్రస్తుత ఆన్లైన్ దరఖాస్తులు మొత్తం 238 ఉన్నాయని వెల్లడించారు. రెవెన్యూ, వ్యవసాయ, పశు సంవర్ధక, ఆలయ అధికారులు దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు. ఆన్లైన్ లో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు మరోసారి తనిఖీ చేసిన తరువాతే కోడెలను పంపిణీ చేశామని తెలిపారు. రైతులకు తిప్పాపూర్ గోశాలలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి కోడెలను రాజన్న ప్రసాదంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వాటికి గడ్డి, దాణా అందజేస్తూ సంరక్షించాలని సూచించారు. పంపిణీ చేసిన కోడెలను వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ అధికారులతో తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. కోడెలను పక్కదారి పట్టించి ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆలయ ఈఓ రమాదేవి, వేములవాడ ఆర్డీఓ రాధాభాయ్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ విజయ ప్రకాష్ రావు, గోశాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home